あらすじ
వాల్మీకి రామాయణం - చారిత్రక దృక్కోణం అనే అంశంపై పరిశోధన చేయడానికి 2004 వ సంవత్సరం లోనే బీజం పడింది. చరిత్ర - చారిత్రక రచనల పట్ల నాకున్న ఆసక్తి తో రెండు చారిత్రక రచనలు చేశాను. ఈ పరంపర తోనే రామాయణంపై దృష్టి పెట్టాను. రామాయణ సంస్కృతికి అనుకూలంగా ఉన్న సాహిత్యం, వ్యతిరేకంగా ఉన్న సాహిత్యం రెండింటిని అధ్యయనం చేయడం ప్రారంభించాను. ఒకరికి కల్పవృక్షంగా ఉన్న రామాయణం మరొకరికి విష వృక్షంగా మారడం, కొందరికి యదార్థమనిపించే రామ కథ మరికొందరికి కల్పనగా కన్పించడం రాముని ఆరాధించే వాళ్లు, రాముని ద్వేషించేవాళ్లు - ఇలా ఎన్నో అంశాలు ఆకట్టుకున్నాయి. రామాయణం అనేది ఓ పుస్తకంగా కన్పించలేదు. అది ఓ సంస్కృతిగా గుర్తించాను. ఆ సంస్కృతి, దాని విశిష్టతను దెబ్బతీయడానికి స్వదేశీ, విదేశీ శక్తులు చేస్తున్న దాడులను గమనించాను. రామాయణం యొక్క చారిత్రకతను గుర్తించాను. అందులోని వాస్తవాల్ని సామాజిక, రాజకీయ స్వరూపాన్ని పాఠకులకు అందించాలన్న సదుద్దేశంతో ఈ గ్రంథ రచనను ప్రారంభించాను. రాళ్ళపై రాతలు కన్పించవు కాని శిలలపై రామకథా శిల్పాలు అనేకం కన్పిస్తాయి. తవ్వకాలలో రామాయణం కాలం నాటి మట్టి పాత్రలు లభించలేదు కాని ప్రతి భారతీయుని గుండెలు తవ్వితే రాముడే కన్పిస్తాడు. అక్కడక్కడ రాజులు వేయించిన రామటెంకెలు (నాణ్యాలు) రామచరిత్రకు ఆధారాలుగా నిలవక పోయినా, భారతీయ సమాజంలో అనాదిగా రామకథా సంబంధిత నామాలు (పేర్లు) అంతటా కన్పిస్తాయి. ఈ కోణంలోనే రాముడి చారిత్రకతను నిరూపించే ప్రయత్నం చేశాను. ఎన్నో అంశాలు నేటికీ చిక్కు వీడని ప్రశ్న. పురావస్తు శాఖ నిరూపించనూలేదు. పాశ్చాత్య దృక్పథంతో రాయబడ్డ భారత చరిత్రను విస్మరించి స్వచ్ఛమైన భారతీయ చారిత్రక తత్వాన్ని నిరూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేదసరస్వతి కల్పన అన్నారు. ఆ నది ఆనవాళ్లు కన్పించాయి. ఆర్యులు విదేశీయులని వారు భారతదేశంపై దండెత్తి వచ్చారన్న అబద్ధపు మాటల్ని చరిత్ర పుటలో ఇరికించారు. ఇప్పుడిప్పుడే సర్దుకుంటూ దండయాత్ర కాదు వలస వచ్చారన్న మరోవాదన తీసుకొచ్చారు. రామాయణంపై జరుగుతున్న దాడులు ఇలాంటివే. రెండు చిన్న ప్రాంతాల్లో చిన్నజాతుల మధ్య జరిగిన కొట్లాట అని చెప్పేవాళ్లు, ఇంత చిన్న చారిత్రక అంశం ఆసియా ఖండమంతటా ఎలా ప్రసిద్ధి పొందింది అని ఆలోచించక పోవడం శోచనీయం. ఒక వేళ రామాయణం జరిగి ఉన్నా, అది అంతా ప్రాచీనమైంది కాదు. అది లోహయుగం తరువాత జరిగింది. ఇందులో లోహపు ఆయుధాలు, పార లాంటి వస్తువులు ఉన్నాయి కాబట్టి ఇనుప యుగం తరువాతే జరిగింది. బంగారు, వెండి గురించి తెలిసిన సింధు నాగరికత ప్రజలకు ఇనుము గురించి తెలియదని వాదించే వాళ్లు ఉన్నారు. ఇతిహాసాలు మానవాళికి అత్యంత విలువైన శాస్త్రీయజ్ఞానాన్ని అందిస్తున్నాయి. ఈ ఇతిహాసాలపై విశ్వాసం ఏర్పడడానికి వాటిలో జరిగిన సంఘటనల్ని నిరూపించాలి. తద్వారా అవి ఊహాత్మక సంఘటనలు కాకుండా చారిత్రక సంఘటనలుగా మార్చబడతాయి. ఈ ప్రయత్నంలో ఖగోళ, జీవావరణ, వేదాంత, పురావస్తు, అంతరిక్ష, మానవశాస్త్రం పరిశోధకులు ఆధునిక వైజ్ఞానిక శాస్త్రాల ద్వారా నిరూపించడానికి పూనుకోవడం సంతోషించదగ్గ పరిణామం. ఆగ్నేయ ఆసియా అంతటా ప్రసిద్ధిగాంచిన రామాయణం కల్పనా? అనే ప్రశ్న గురించి భారతీయులెవరూ ఆలోచించరు. రామాయణం దైవికం. రాముడు దేవుడు. అందువల్ల దాన్ని గురించి ఎవరేమన్నా పట్టించుకోరు. భారతీయ ఔన్నత్యాన్ని దెబ్బతీసే శక్తులు వేదాలపైన ఇతిహాసాలపైన, పురాణాలపైన చిమ్మే విషపూరిత వ్యాఖ్యలు వారి మానసిక రుగ్మతకు నిదర్శనం. సగటు భారతీయుడెవ్వరికి వేద, ఇతిహాస, పురాణ సాహిత్యాల్ని పరిచయం చేయకుండా, ఆంగ్ల సాహిత్యాన్ని అతిపెద్ద సాహిత్యంగా భూతద్దంలో చూపుతున్న పాలకులు. ఈ దేశ నాయకులుగా ఉండడం భారతీయుల దురదృష్టం. ఇక్కడ మతాల గురించి, మతశక్తుల గురించి చర్చించడం లేదు. భారతీయ ప్రాచీనతను ప్రజలకు పరిచయం చేయడం ద్వారా భారతీయ జాతి మానసిక బలాన్ని, విశ్వాసాన్ని పొందగలుగుతుంది. శిధిలమైన పురాతన కోటలలో తవ్వకాలు జరిపించి నిధులను సేకరించే వ్యక్తులు ఈ దేశ ప్రాచీన చరిత్రను వెలికి తీస్తారని ఆశించడం అతిశయోక్తి అవుతుంది. ఇలాంటి ఆలోచనలు ఈ కావ్య నిర్మాణానికి ప్రేరణ. రామాయణ విశిష్టతో పాటు రాజకీయ, సామాజిక, భౌగోళిక అంశాల్ని పాఠకుల ముందుకు తేవడానికి ఈ చిన్న ప్రయత్నం చేశాను. ఇందుకు సహకరించిన నాకుటుంబ సభ్యులకు, ప్రోత్సహించిన మిత్రులకు, ఈ రచన పూర్తి కావడానికి నా కలాన్ని పరుగు పెట్టించిన మిత్రుడు పామిరెడ్డి సుధీర్ రెడ్డి, పద్మజ దంపతులకు, నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. ఈ పుస్తకానికి అందమైన చిత్రాల్ని లిఖించిన రూపశిల్పి మాధవరావు గారికి, ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయ పడిన అందరికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. - డాక్టర్. పామిరెడ్డి దామోదరరెడ్డి